
కోనాయిపల్లి వెంకన్న టెంపుల్కు సీఎం కేసీఆర్ ..
జాతీయ రాజకీయల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమైన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్(KCR)అందుకోసం ఎలాంటి అడ్డంకులు, అవాంతరాలు తలెత్తకుండా ఉండాలని భావిస్తున్నారు. స్వతహాగా దైవభక్తితో పాటు సెంటిమెంట్(Sentiment)ను నమ్మే ఆయన తన రాజకీయ అడుగులు వేసే విషయంలో పూర్తిగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే విజయదశమి(Dussehra)రోజు జాతీయ పార్టీ పేరు ప్రకటించిన సీఎం కేసీఆర్ అందులో భాగంగానే అంతకుముందే నిర్వహించాల్సిన పూజాది కార్యక్రమాలను తన సెంటిమెంట్ ప్రకారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం (Monday)సీఎం కేసీఆర్ సిద్దిపేట(Siddipet)జిల్లా పర్యటనకు వెళ్తున్నట్లుగా సమాచారం ఉంది.
దైవనుగ్రహం కోసం..
తెలంగాణ సీఎం కేసీఆర్కి జాతీయ రాజకీయాల్లోకి అఢుగుపెడుతున్న క్రమంలో సిద్దిపేట జిల్లా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. లక్ష్య సాధన కోసం ఎంతకైనా తెగించే కేసీఆర్...తాను తలపెట్టిన కార్యక్రమానికి దైవానుగ్రహం కూడా తోడవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాను సెంటిమెంట్గా భావించే కోనాయిపల్లి వెంకన్న స్వామిని సోమవారం దర్శించుకోనున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలోని కోనాయిపల్లికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈనెల 5వ తేదిన ప్రకటించబోయే జాతీయ పార్టీ పేరు ప్రతులతో పాటు ఈనెల 9వ తేదిన కేంద్ర ఎన్నికల సంఘానికి చేసుకునే దరఖాస్తు ప్రతులకు పూజలు చేయించనున్నట్లుగా తెలుస్తోంది.
సెంటిమెంట్ హిస్టరీ ..
ఉద్యమకారుడిగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి రాజకీయ ప్రస్థానంలో కూడా అపజయమెరుగని కేసీఆర్ తాను చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి దైవానుగ్రహం కోసం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అక్కడ పూజలు చేసి వెంకన్న ఆశీస్సులు తీసుకుంటే తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని కేసీఆర్ ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు కూడా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సెంటిమెంట్ ఇప్పుడు మొదలుపెట్టింది కాదు. 1985లో ఎమ్మెల్యేగా గెలిస్తే వచ్చి మొక్కులు తీర్చుకుంటానని కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల సమయంలో అదే సెంటిమెంట్ని కొనసాగిస్తూ వస్తున్నారు.
విజయం సాధించాలని..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావడం, పార్టీకి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఈతరుణంలో కూడా కేసీఆర్ తన సెంటిమెంట్ను నమ్ముతున్నారు. అందులో భాగంగానే సోమవారం జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించిన పత్రాలు, ఈసీకి ఇచ్చే అఫిడవిట్లను దేవుని ముందుంచి ప్రత్యేక పూజలు చేస్తారని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు గ్రామ సర్పంచ్.