తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు రానున్నాయా

తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు రానున్నాయా. అధికార పార్టీ ముఖ్య నేతలు అటువంటి ఆలోచన లేదని చెబుతున్నా..సంకేతాలు మాత్రం అదే దిశగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ కు త్వరలో అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రానుంది. ఆ వెంటనే జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్ బీజీ కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ నేతలను ముందస్తు పేరు చెప్పకుండానే..ఎప్పుడైనా ఎన్నికలకు సిద్దంగా ఉండాలనే విధంగా సంకేతాలు అందుతున్నాయి. ఎంపీలు -ఎమ్మెల్యేలతో కీలక భేటీ ఇదే సమయంలో టీఆర్ఎస్ఎల్పీ ..పార్లమెంటరీ పార్టీ నేతలతో మంగళవారం కీలక సమావేశం జరగనుంది.

మునుగోడులో పార్టీ నేతలంతా సమిష్ఠిగా పని చేసి పార్టీ అభ్యర్దిని గెలిపించారు. టీఆర్ఎస్ నేతలే లక్ష్యంటీ ఈడీ - ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దీనిని టీఆర్ఎస్ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటోంది.రాజకీయ లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తున్నారని భావిస్తోంది. దీంతో..తెలంగాణలో 2018 తరహాలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2023 చివరి త్రైమాసికంలో సరిగ్గా.. సంవత్సరంలోగా తెలంగాణకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదే సమయంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు..జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలంటే ముందుగా సొంత రాష్ట్రంలో బలం నిరూపించుకోవటం అవసరమని గులాబీ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇందులో భాగంగానే, మంగళవారం జరిగే పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి దిశా నిర్దేశం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. గతంలోనే పార్టీ ముఖ్య నేతలు ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేసారు. కానీ, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అటు ప్రధానితో సహా బీజేపీ నేతలంతా తెలంగాణలో అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో.. ముందు గానే ఎన్నికలకు వెళ్లటం ద్వారా టీఆర్ఎస్ కు కలిసి వస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

ముందస్తు పై మరోసారి ప్రచారం

ఇదే సమయంలో, వరుసగా రెండో సారి ముందస్తుకు వెళ్లటం ద్వారా ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది.. రాజకీయంగా ఎదురయ్యే లాభ నష్టాల పైన పార్టీ ముఖ్య నేతలు చర్చలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ సమావేశంలో మాత్రం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్దంగా ఉండాలంటూ సీఎం కేసీఆర్ స్పష్టమైన మార్గనిర్దేశనం చేస్తారని చెబుతున్నారు. ఇక, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండాలని సూచించనున్నట్లు తెలుస్తోంది. సంచలన రాజకీయ నిర్ణయాలతో వార్తల్లో నిలిచే సీఎం కేసీఆర్..ఇప్పుడు ఎన్నికల పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.