
కేసీఆర్ కీలక నిర్ణయం.. 84 గ్రామాల్లో నెరవేరనున్న 26 ఏళ్ల కల
జీవో 111 ఎత్తివేతకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఆ జీవో పరిధిలోని ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ 26 ఏళ్ల కల నెరవేరనుందని, అభివృద్ధికి అడ్డు తొలగిపోనుందని స్థానికులు చెబుతున్నారు. 84 గ్రామాల్లోని సుమారు లక్షా 32 వేల ఎకరాల భూ మికి విముక్తి లభిస్తుందని అంటున్నారు. నిజాం కాలంలో హైదరాబాద్కు తాగునీరు అందించడం కోసం నిర్మించిన ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్ జలాశయాల్లో నీళ్లు కలుషితం కాకుండా ఉండటం కోసం 1996లో అప్పటి ప్రభు త్వం 111 జీవోను తీసుకొచ్చింది.
జలాశయాల ఎగువ ప్రాంతంలోని 84 గ్రామాలను జీవో పరిధిలో చేర్చి కొన్ని నిబంధనలను విధించింది. అయితే దీనివల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి కుం టు పడుతోందని, భూములకు ధరలు పెరగడం లేదని స్థానిక రైతులు, రాజకీయ పార్టీల నాయకులు ఎన్నో ఏళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. జీవో ఎత్తివేయాలనే డిమాండ్ స్థానికంగా మరింత ఊపందుకోవడంతో ఎన్నికల సమయంలో రాజ కీయ పార్టీలు ఈ మేరకు హామీ ఇచ్చాయి. సీఎం కేసీఆర్ కూడా జీవో 111 ఎత్తివేతకు హామీ ఇచ్చా రు.
ఈ నేపథ్యంలోనే నెల రోజుల క్రితం అసెంబ్లీలో.. హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం కృష్ణా, గోదా వరి నీళ్లు సరఫరా అవుతున్నందున జంట జలాశయాల నీటిని వినియోగించడంలేదని, అందువల్ల జీవో 111ను ఎత్తేస్తామని ప్రకటించారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో జీవో పరిధిలోని రైతులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. మొయినాబాద్ మండల కేం ద్రంతో పాటు పలు గ్రామాల్లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. 111 జీవో ఎత్తివేతతో ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయని, అభివృద్ధి జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
26 ఏళ్ల కల సాకారం అవుతోంది
జీవో 111 కారణంగా తమ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని మొయినాబాద్ మండలం అజీజ్నగర్కు చెందిన కొత్త నర్సింహారెడ్డి చెప్పారు. ఆ జీవో ఎత్తేయాలని ఏళ్ల తరబడి పోరాటాలు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో జీవో రద్దు కానుండటంతో 26 ఏళ్ల కల ఇప్పుడు సాకారం అవుతోందని చెప్పారు.