
కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి రాపోలు ఆనందభాస్కర్
హైదరాబాద్: ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి రాపోలును టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు కేటీఆర్. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి రాపోలు ఆనంద భాస్కర్ 2012లో కాంగ్రెస్ తరపున రాపోలు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
2018లో పదవీ కాలం పూర్తి కావడంతో 2019లో ఆయన బీజేపీలో చేరారు. తాజాగా, బీజేపీకి రాజీనామా చేసిన రాపోలు ఆనందభాస్కర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేంద్ర ప్రభుత్వం నిర్వాకాలు భరించలేకే బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు రాపోలు ఆనందభాస్కర్ తెలిపారు. ఇప్పటికే బీజేపీ నుంచి భిక్షమయ్యగౌడ్, స్వామిగౌడ్, దాసోజు శ్రావణ్లు టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. తాజాగా రాపోలు కూడా బీజేపీని వీడటం ఆ పార్టీకి ఎదురెబ్బ తగిలినట్లయింది. మునుగోడు ఉపఎన్నికల వేళ ఈ నేతలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంపింగ్లు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రాపోలుపై కేటీఆర్ ప్రశంసలు రాపోలు చేరిక సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాపోలు ఆనందభాస్కర్ ను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాపోలు సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్త అని కొనియాడారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కేంద్రంపై కేటీఆర్ విమర్శలు వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమేనని కేటీఆర్ అన్నారు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మి పేరుతో కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు. నేతన్నకు బీమాతో కార్మికులకు అండగా ఉంటున్నామని, చేనేత కళాకారులకు అవార్డులు ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.