కేటీఆర్ కోరగానే.. తెలంగాణలో నిరంతర పెట్టుబడులకు సిద్ధమన్న అజీమ్ ప్రేమ్జీ

హైదరాబాద్: విప్రో సంస్థల అధినేత అజీమ్ ప్రేమ్జీపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శమని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఈ-సీటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

మహేశ్వరంలో విప్రో పరిశ్రమ.. 900 మందికి ఉపాధి ఈ పరిశ్రమ ద్వారా 900 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విప్రో పరిశ్రమలో స్థానికంగా ఉన్న కందుకూరు, మహేశ్వరం ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు. దాదాపు రూ. 300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేశారని, కాలుష్యం బయటకు రాకుండా జర్మన్ సాంకేతికతను ఉపయోగిస్తూ అన్ని చర్యలు తీసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సరళతర వాణిజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా రాష్ట్రంలో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త పరిశ్రమలకు రాయితీలు, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.

అజీమ్ ప్రేమ్జీపై కేటీఆర్ ప్రశంసలు టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 2,20,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో ఏడేళ్లలో 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని కేటీఆర్ తెలిపారు. అజీమ్ ప్రేమ్జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయమని, ఆయన జీవితం అందరికీ అనుసరణీయమని, మంచి పాఠం లాంటిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం అందరికీ ఆదర్శమన్నారు. కరోనా సమయంలో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలను కేటీఆర్ కొనియాడారు.

తెలంగాణలో నిరంతర పెట్టుబడులంటూ అజీమ్ ప్రేమ్జీ ఎల్ఈడీ పరిశ్రమతోపాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా అజీమ్ ప్రేమ్ జీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకంగా ఉందన్నారు. కరోనా నియంత్రణలో తెలంగాణ కీలకంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణలో నిరంతరంగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నామని, పెట్టుబడులతో ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నట్లు అజీమ్ ప్రేమ్ జీ తెలిపారు.