హ‌నుమాన్ జ‌యంతి..‘ఆచార్య’ సెట్స్ నుంచి అరుదైన వీడియో షేర్ చేసిన చిరంజీవి

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా ఆచార్య సినిమా సెట్స్‌లో జ‌రిగిన విష‌యాన్ని వీడియోగా చిత్రీక‌రించి మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

టాలీవుడ్‌లో అగ్ర క‌థానాయ‌కుడైన మెగాస్టార్ చిరంజీవి ఆరాధ్య దైవం ఎవ‌రంటే త‌డ‌ముముకోకుండా వ‌చ్చే స‌మాధానం ఆంజ‌నేయ స్వామి. మెగా ఫ్యామిలీ కుటుంబ దైవం కొండ‌గ‌ట్టు హ‌నుమంతుడు. ఈ విష‌యాన్ని రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సంద‌ర్భంలో చెప్పారు. హ‌నుమంతుడిని ఎంతో ఇష్టంగా పూజించే మెగా ఫ్యామిలీకి ఆంజ‌నేయ స్వామి ఆశీస్సులున్నాయా? అనిపించేలా ఓ విష‌యం జ‌రిగింది. ఆ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో ద్వారా తెలియ‌జేయ‌డం విశేషం. అస‌లు ఏం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే..

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో కొన్ని స‌న్నివేశాల‌ను వీరిద్ద‌రిపై మారేడు మిల్లి ఫారెస్ట్‌లో చిత్రీక‌రించారు. ఆ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ ఓ రోజున మేక‌ప్ వేసుకుంటున్నారు. అప్పుడు ఓ వాన‌రం ఆయ‌న ఉండే రూమ్‌లోకి ప్ర‌వేశించింది. కొద్దిసేపు కూర్చుని ఆయ‌న్ని చూసింది. దాన్ని గ‌మ‌నించిన రామ్ చ‌ర‌ణ్ దానికి బిస్కెట్స్‌ను ఇచ్చారు. ఆ వాన‌రం ఆ బిస్క‌ట్స్‌ను తినేసి వెళ్లింది. అక్క‌డున్న రామ్ చ‌ర‌ణ్ స్టాఫ్ దాన్ని వీడియో తీశారు. స‌ద‌రు వీడియోను హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా అంద‌రికీ తెలియ‌జేశారు. వీడియో చూసిన నెటిజ‌న్స్ అద్భుతంగా ఉంద‌ని అంటున్నారు. కొంద‌రైతే మీ కుటుంబానికి ఆంజ‌నేయ స్వామి ఆశీస్సులుంటాయి సార్ అని కామెంట్స్ చేస్తున్నారు.

‘ఆచార్య’ సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటించారు. ధర్మస్థలి అనే అలయం బ్యాక్ డ్రాప్‌తో సాగే సినిమా ఇది. దీనికి న‌క‌ల్సిజం అనే కాన్సెప్ట్‌ను జ‌త చేసి డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించారు. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది.