Acharya: మెగాస్టార్‌కి మహేశ్‌ బాబు సాయం..అప్పుడు ‘జల్సా’.. ఇప్పుడు ‘ఆచార్య’

హీరో మహేశ్‌బాబు ‘ఆచార్య’కి మాట ఇస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. చిరంజీవి–కాజల్‌ అగర్వాల్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌–పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

కాగా ఈ చిత్రం కోసం మహేశ్‌బాబుని వాయిస్‌ ఓవర్‌ ఇవ్వమని కొరటాల శివ కోరారట. అందుకు మహేశ్‌ అంగీకరించారని తెలిసింది. రెండు రోజుల్లో మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ని రికార్డ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారని సమాచారం. సినిమాకి సంబంధించిన కీలక ఘట్టాలను వివరిస్తారట మహేశ్‌. కాగా పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జల్సా’ సినిమాకి మహేశ్‌బాబు తొలిసారి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగైదు చిత్రాలకు కూడా వాయిస్‌ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ‘ఆచార్య’కు ఇస్తున్నారు.