కీలక బిల్లు తీసుకురానున్న తెలంగాణ సర్కార్..? గవర్నర్ తమిళిసైపై కేసీఆర్ యాక్షన్..
యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ను తప్పించే బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తెచ్చే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ వివాదాస్పద కామెంట్స్, బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ ప్రవర్తిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్ను తప్పించే బిల్లును తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం పడినట్లు చెబుతున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాలు ఇలాంటి బిల్లులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళి సై మధ్య నెలకొన్న విబేధాలు రాష్ట్రంలో హీట్ పుట్టిస్తున్నాయి. ఈ పరిణామాలు చివరికి రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య బిగ్ గ్యాప్కు దారితీశాయి. నేరుగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ పలుమార్లు తీవ్ర విమర్శలు చేయడం, అదే రీతిలో ఆమె ఆరోపణలకు టీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అవ్వడంతో.. గవర్నర్ వర్సెస్ గవర్న్మెంట్ పోరు తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వ తీరుపై పలుమార్లు కేంద్ర పెద్దలను కలిసి గవర్నర్ ఫిర్యాదు చేశారు.
ఈ పరిణామాల క్రమంలో గవర్నర్ తమిళి సై విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల తరహాలోనే గవర్నర్ను యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి తప్పించే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. డిసెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుతో పాటు గవర్నర్ వ్యవహారశైలిపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది.
దాదాపు 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ సమావేశాల్లో గవర్నర్ను వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తప్పించే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తోంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ సంతకం పెడితేనే అమల్లోకి వస్తుంది. తనకు వ్యతిరేకింగా తెచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించే అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదు. కాకపోతే గవర్నర్ తీరును నిరసిస్తూ ఈ బిల్లును తీసుకురావాలని టీఆర్ఎస్ సర్కార్ చూస్తోంది.
విశ్వవిద్యాలయాల్లో పోస్టులను భర్తీ చేయడానికి తెచ్చిన ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డుతో పాటు అనేక బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్నాయి. వాటిని ఆమోదించేందుకు గవర్నర్ మరింత ఆలస్యం చేస్తోన్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేరుగా రాజ్భవన్కు వెళ్లి ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్ అనుమానాలకు నివృత్తి చేశారు. అయినా ఇప్పటివరకు ఇంకా గవర్నర్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో గవర్నర్ తీరుకు నిరసనగా ఆమెను యూనివర్సిటీల ఛాన్సలర్ పదవి నుంచి తొలగించే బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు.
కాగా కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు కూడా గవర్నర్లను విశ్వవిద్యాలయ ఛాన్సలర్ల పదవుల నుంచి తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చాయి. కానీ అవి ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. ఇప్పుడు గవర్నర్ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా బిల్లు తెచ్చే యోచనలో కనిపిస్తోంది. మరి దీనిపై ఎలాంటి వివాదం చెలరేగుతుందో చూడాలి.
