మెడికల్‌ టూరిజంలో మూడో స్థానం

మెడికల్‌ టూరిజంలో హైదరాబాద్‌ నగరం దేశంలోనే 3వ స్థానంలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే మరింత మెరుగైన స్థానానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వరల్డ్‌ క్లాస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరుగుతుందని తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లను పెంచుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కార్పొరేట్‌ ఆసుపత్రుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ పీవీఎస్‌ రాజు, డాక్టర్‌ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు.