హైదరాబాద్‌ మెట్రో రైల్ ప్రాజెక్టు మరో జాతీయ స్థాయి అవార్డు.

హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంగా మారిన మెట్రో రైల్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. రైల్‌ అనాలసిస్‌ ఇండియా ప్రకటించిన ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ గ్రీన్‌ అండ్‌ సస్టెయినబుల్‌ మెట్రో సిస్టమ్‌’ విభాగంలో హైదరాబాద్ మెట్రో అవార్డు దక్కించుకుంది. ఇటీవల దిల్లీలో జరిగిన రైల్‌ అనాలసిస్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎక్స్‌లెన్స్‌ సదస్సు- 22లో ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో సీవోవో సుధీర్‌ చిప్లుంకర్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మెట్రోలో అనుసరిస్తున్న విధానాలపై రైల్ అనాలసిస్ ఇండియా ప్రశంసలు కురిపించింది. తాము చేపట్టిన పనులకు గుర్తింపుగా జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం సంతోషంగా ఉందని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ మెట్రో విశేషతలు ఇవే...
* కర్బన ఉద్గారాలను తగ్గించడానికి మెట్రో రైల్ అధికారులు సౌర విద్యుత్తును వినియోగిస్తున్నారు.
* రెండు మెట్రో డిపోలు, 28 స్టేషన్ల పైకప్పులపై కలిపి 8.35 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.
* మెట్రో రైల్ బ్రేక్‌ వేయడం ద్వారా ఉత్పత్తయ్యే 35 శాతం కరెంట్‌ అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టారు.
* తక్కువ విద్యుత్తు వాడకంతో పాటు సహజ వెలుతురు, వాన నీటి సంరక్షణ వంటి హరిత లక్ష్యాలతో చేపట్టిన 20 మెట్రో స్టేషన్లకు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ప్లాటినం రేటింగ్‌ ఇచ్చింది.
* మెట్రో రైలు మార్గాల్లో 150 వరకు వాననీటి ఇంకుడు గుంతలతో వర్షపు నీటిని భూమిలోకి ఇంకే ఏర్పాట్లు చేశారు. ఉప్పల్‌, మియాపూర్‌ డిపోల్లో కురిసిన      వాననీరు మొత్తం అక్కడే భూమిలోకి ఇంకుతోంది. ఇక్కడ కరెంట్‌ వాడకం కంటే ఉత్పత్తి అధికంగా ఉండటం విశేషం.