అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌


జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో విశ్వవిద్యాలయం గోల్డెన్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’ అనే అంశంపై ఏర్పా టు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, జేఎన్‌టీయూ వీసీ కట్ట నరసింహారెడ్డి, సియాంట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

టాలెంట్‌ ఎవరి సొత్తుకాదని.. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని, ఎంతకాలం కంపెనీ సీఈవోలుగా కొనసాగుదామని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. యువత కంపెనీలలో సీఈవోలుగా పని చేయడం కాదని, అలాంటి కంపెనీలు సొంతంగా స్థాపించి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకోవాలన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ గురువారం జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో యూనివర్సిటీ గోల్డెన్‌ జూబ్లీ సందర్భంగా ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’ అనే అంశంపై ఏర్పాటు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, జేఎన్‌టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి, సెయింట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సింగిల్‌ విండో విధానం ప్రవేశపెట్టామని, దాని వల్ల కంపెనీలు స్థాపించడానికి చాలా తేలికవుతుందని అన్నారు. 15 రోజులలోనే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే విధంగా టీఎస్‌-ఐపాస్‌ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశ పెట్టామన్నారు. ఇప్పటికే కొన్ని వేల కంపెనీలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. మేకిన్‌ ఇండియాపై ప్రధాని మోడీ నిర్వహించిన సమావేశంలో ‘ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజీవ్‌గ్రోత్‌’ వంటి త్రిబుల్‌ ఐ మంత్రం చెప్పానన్నారు. ఆ కోణంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు.

రాష్ట్రపతి అయ్యాకే ద్రౌపది ముర్ము స్వగ్రామానికి కరెంటు వచ్చిందని, అలాంటిది తెలంగాణ ఏర్పాటైన వెంటనే సీఎం కేసీఆర్‌ నిరంతర కరెంటు అందిస్తున్నారని అన్నారు. దేశంలో అన్ని నదులు, నీటి వనరులతో 70వేల టీఎంసీల నీటి వసతి ఉందని, అందులో సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 50 నుంచి 55 టీఎంసీల నీటినే ఉపయోగిస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ఇరిగేషన్‌ ప్రాజెక్టు రాష్ట్రంలోనే ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును జేఎన్‌టీయూ విద్యార్థులంతా సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ యూనివర్సిటీ వీసీతో అన్నారు.

మన ఇంట్లో టీవీలు, మొబైల్స్‌, వాషింగ్‌ మెషీన్ల వంటి పేర్లు ఎల్‌జీ, శ్యామ్‌సంగ్‌, పానసోనిక్‌ వంటి ఇతర దేశాలకు చెందిన వస్తువులే ఉంటాయి. చైనా నుంచి బట్టలు కూడా దిగుమతి అవుతున్నాయి. మరి మనమెందుకు ఇలాంటి వస్తువుల తయారీపై దృష్టి పెట్టడం లేదు? 75 ఏండ్ల భారతావనిలో ఎక్కడో స్పార్క్‌ మిస్‌ అయ్యింది. అందుకే మన దేశంలో 3.3 ట్రిలియన్ల విలువైన సంపద ఉంటే.. చైనాలో మాత్రం 16 ట్రిలియన్ల విలువైన సంపద ఉంది. ఈ తేడాను మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇన్నోవేటివ్‌గా ఆలోచిద్దాం. ఉబర్‌, అమేజాన్‌ వంటి యాప్‌ సేవలను మీరూ ప్రారంభించొచ్చు. పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవచ్చు.
– పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

రాష్ర్టానికి పెద్ద కంపెనీలు తెచ్చిన ఘనత మంత్రి కేటీఆర్‌దే
రాష్ట్రం ఏర్పాటైన ఎనిమిదేండ్లలోనే ఎన్నో ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్‌ కంపెనీలు తీసుకువచ్చిన ఘనత మంత్రి కేటీఆర్‌దేనని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశంసించారు. రాష్ర్టానికి కంపెనీలు రావడం వల్ల 16 లక్షల మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆర్‌. లింబాద్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ కృషి వల్లే రాష్ట్రంలో అంతర్జాతీయ కంపెనీల్లో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ‘ఇండస్ట్రియల్‌ అకాడమిక్‌ కోలాబ్రేషన్‌ సెంటర్‌’ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెయింట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మంజూర్‌ హుస్సేన్‌, ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎల్‌ఎస్‌ గణేశ్‌, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ తారాకల్యాణి, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్నట్లు కేసీఆర్ చేసిన ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనేక చోట్ల టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. అంబేద్కర్ అసలైన నివాళి ఇదేనని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.