‘డబుల్‌’ ధమాకా!

కామన్వెల్త్‌ క్రీడల టీమ్‌ ఈవెంట్లలో భారత్‌ రెండు బంగారు పతకాలతో మెరిసింది. లాన్‌బౌల్స్‌లో డార్క్‌ హార్స్‌గా బరిలోకి దిగిన మహిళలు.. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో స్వర్ణ చరిత్ర లిఖించగా.. టీటీ పురుషులు మరోసారి చాంపియన్లుగా నిలిచారు. లిఫ్టర్‌ వికాస్‌ ఠాకూర్‌ రజత కాంతులీనాడు.

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల ఐదో రోజు భారత్‌ రెండు పసిడి సహా మూడు పతకాలతో అదరగొట్టింది. ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల లాన్‌బౌల్స్‌ జట్టు స్వర్ణంతో చరిత్ర సృష్టించగా.. పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఫైనల్లో శరత్‌ కమల్‌, సాథియన్‌, హర్మీత్‌ దేశాయ్‌, సనిల్‌ షెట్టిలతో కూడిన డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ 3-1తో సింగపూర్‌పై గెలిచి మరోసారి పసిడి పతకాన్ని సొంత చేసుకుంది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో వికాస్‌ ఠాకూర్‌ రజతం నెగ్గాడు. మంగళవారం జరిగిన లాన్‌బౌల్స్‌ మహిళల ఫోర్స్‌ ఫైనల్లో లవ్లీ చౌబే (లీడ్‌), పింకీ (సెకండ్‌), నయన్‌మోనీ సైకియా (థర్డ్‌), రూపా రాణి టిర్కీ (స్కిప్‌)తో కూడిన భారత్‌ 17-10తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకొంది. ఈ విభాగంలో భారత్‌ పతకం నెగ్గడం క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. కాగా, ఫిజిపై 17-10తో నెగ్గిన న్యూజిలాండ్‌ కాంస్యం సాధించింది. హోరాహోరీగా సాగిన 15 రౌండ్ల పోరులో.. ఒక దశలో భారత్‌ 8-2తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ, అనూహ్యంగా పుంజుకొన్న సౌతాఫ్రికా వరుసగా మూడు రౌండ్లు నెగ్గి 8-8తో స్కోరు సమం చేసింది.

11వ రౌండ్‌లో మరో రెండు పాయింట్లు సాధించిన సౌతాఫ్రికా 10-8తో ముందంజ వేసింది. కానీ, భారత మహిళలు పట్టువీడకుండా తర్వాతి రౌండ్‌ గెలిచి మరోసారి స్కోరు సమం చేశారు. ఇక ఆఖరి మూడు రౌండ్లలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతూ విజేతలుగా నిలిచారు. మహిళల ట్రిపుల్‌ సెక్షనల్‌-సెక్షన్‌-సిలో భారత్‌ 15-11తో న్యూజిలాండ్‌పై నెగ్గగా.. పెయిర్‌ సెక్షన్‌-బిలో భారత్‌ 9-18తో న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది.

పూనమ్‌ విఫలం..: మహిళల 76 కిలోల విభాగంలో పూనమ్‌ యాదవ్‌ పేలవ ప్రదర్శనతో అట్టడుగున నిలిచింది. స్నాచ్‌లో పతక రేస్‌లో నిలిచినా.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లోని మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైంది. స్నాచ్‌లో రెండో ప్రయత్నంలో 95 కిలోలు, మూడో ప్రయత్నంలో 98 కిలోలు ఎత్తి పూనమ్‌ రెండో స్థానంలో నిలిచింది. అయితే, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో మూడు సార్లు యత్నించినా.. 116 కిలోలు ఎత్తలేకపోయింది. ఆఖరి ప్రయత్నం తర్వాత జడ్జీల నిర్ణయాన్ని సవాల్‌ చేసినా.. తిరస్కరించడంతో పోటీ నుంచి డిస్‌క్వాలిఫై అయింది.డబుల్‌ ధమాకా!మళ్లీ టైటిల్‌ మనదేకామన్వెల్త్‌లో భారత పురుషుల టీటీ జట్టు మూడో బంగారు పతకాన్ని కైవసం చేసుకొంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ చాంపియన్‌ భారత పురుషుల టీటీ జట్టు సింగపూర్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత జరిగిన డబుల్స్‌లో హర్మీత్‌ దేశాయ్‌-సాథియన్‌ జంట 13-11, 11-7, 11-5తో యంగ్‌ లజాక్‌ క్వెక్‌-యు ఎన్‌ కొయంగ్‌ పాంగ్‌పై గెలిచి శుభారంభం అందించారు. కానీ, సింగిల్స్‌లో శరత్‌ కమల్‌ 7-11, 14-12, 3-11, 9-11తో జి యు క్లారెన్స్‌ చ్యూ చేతిలో ఓడడంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో సాథియన్‌ 12-10, 7-11, 11-7, 11-4తో యు ఎన్‌ కొయంగ్‌ పాంగ్‌పై గెలిచి టీమిండియాను మళ్లీ ఆధిక్యంలో నిలిపాడు. మరో సింగిల్స్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 11-8, 11-5, 11-6తో జి యు క్లారెన్స్‌ చ్యూపై గెలిచి భారత విజయాన్ని ఖరారు చేశాడు. కాగా, ఈ విజయంతో కామన్వెల్త్‌లో 10వ పతకం సాధించిన శరత్‌ కమల్‌.. ఈ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన షూటర్‌ గగన్‌ నారంగ్‌ సరసన నిలిచాడు. 

డబుల్‌ ధమాకా!రజత ‘వికాసం’పురుషుల 96 కిలోల కేటగిరీలో వికాస్‌ ఠాకూర్‌ 346 (155+191) కిలోల బరువు ఎత్తి రజత పతకాన్ని సాధించాడు. స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో 149, 153, 155 కిలోలు ఎత్తిన వికాస్‌.. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 187, 191 కిలోలు ఎత్తినా.. ఆఖరి ప్రయత్నంలో మాత్రం 198 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. సమోవాకు చెందిన డాన్‌ ఓపెలోగ్‌ 381 (171+210)కిలోల రికార్డుతో స్వర్ణం గెలవగా.. ఫిజి ఆటగాడు తానియెలా 343 (155+188) కిలోలు ఎత్తి కాంస్యం సాధించాడు. 2014లో రజతం సాధించిన వికాస్‌.. 2018లో కాంస్యం దక్కించుకున్నాడు.