నీతి ఆయోగ్‌ భజన బృందంగా మారిపోయింది: సీఎం కేసీఆర్‌

నీతి ఆయోగ్‌లో మేథోమథనం జరగడం లేదని, భజన బృందంగా మారిందని సీఎం కేసీఆర్‌ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ప్లానింగ్‌ కమిషన్‌ను తీసేసి నీతి ఆయోగ్‌ తీసుకొచ్చి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఏ హామీ నెరవేరడం లేదని అన్నారు.  8 ఏళ్ల నీతి ఆయోగ్‌ సాధించింది ఏం లేదని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రమే అడ్డుకుంటోందని  మండిపడ్డారు.  

కేంద్రం డిక్టేటరిజం పెరిగిపోయిందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. నీతి ఆయోగ్‌లో కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం లేదని అన్నారు. అన్ని రంగాల్లో దేశం వెనకబడిపోయిందని అన్నారు. దేశ భవిష్యత్తు రోజురోజుకు ప్రమాదంలో పడుతోందన్నారు. కూర్చున్న కొమ్మను తామే నరుకున్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను పట్టించుకోలేదని,. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సమస్య పరిష్కారానికి కృషి చేశామని గుర్తు చేశారు. కేంద్రం అవార్డులు, నీతి ఆయోగ్‌ ప్రశంసలన్నీ అందుకున్నా.. నిధుల విషయంలో రాష్ట్రంపై చిన్నచూపు చూపిస్తున్నారని ప్రస్తావించారు.
చదవండి: నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం కేసీఆర్‌

‘ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఫెడరల్‌ స్ఫూర్తి పోయి మేము ఏం చెబితే అది చేయాలనే వరకు పరిస్థితి వచ్చింది. మేము చెప్పింది చేయకపోతే.. మీ కథ చూస్తామని హెచ్చరిస్తున్నారు. ట్యాక్సులకు సెస్‌లనే పేరు మార్చి రాష్ట్రాల నిధులను కేంద్ర కొల్లగొడుతుంది. సీఎం స్థాయి వ్యక్తికి కూడా టైమ్‌ పెట్టి అయిపోగానే బెల్‌ కొడుతుంటారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు కాళ్లు అడ్డం పెట్టకుండా ప్రోత్సహించాలని కోరాను. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు 24 ఏల కోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా ఇవ్వలేదు. నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వనప్పుడు ఇంక ఆ సంస్థ ఎందుకు’ అంటూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌పై సీఎం కేసీఆర్‌ ద్వజమెత్తారు.