అందుబాటులోకి 10 డయాగ్నస్టిక్‌ మినీ హబ్‌లు, ఫ్రీగానే టెస్టులు

పేద రోగులకు మెరుగైన వైద్యంతో పాటు, నాణ్యమైన వైద్య పరీక్షల కోసం తెలంగాణ సర్కార్ ఎంతో కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో మరో 10 డయాగ్నస్టిక్‌ మినీ హబ్‌లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రజలకు శుభవార్త. పేద రోగులకు మెరుగైన వైద్యంతో పాటు, నాణ్యమైన వైద్య పరీక్షల కోసం కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో 10 టీ-డయాగ్నస్టిక్‌ మినీ కేంద్రాలు ఇవ్వాళ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 151 పీహెచ్‌సీలకు అనుసంధానం చేయనున్నారు. అన్ని రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రే తదితర రేడియాలజీ పరీక్షలను ఇక్కడ ఉచితంగా పేద రోగులకు నిర్వహిస్తారు.

ఈ కేంద్రాలను అమీర్‌పేట, శేరిలింగంపల్లి, అల్వాల్‌, కుషాయిగూడ, పఠాన్‌చెరు, మలక్‌పేట, హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, గోల్కొండ, నార్సింగ్‌లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నార్సింగిలో మంత్రి హరీశ్‌రావు, అమీర్‌పేట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వీటిని ప్రారంభించబోతున్నారు.

రేపట్నుంచే ఆస్పత్రుల్లో రూ.5కే భోజనం
మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.5కే భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన కేంద్రాలను ఆస్పత్రుల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. తొలి విడతలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 9 ఆస్పత్రుల్లో వీటిని ప్రారంభించబోతున్నారు. ఉస్మానియా, నిలోఫర్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌, చెస్ట్‌, ఈఎన్‌టీ, సరోజినీ దేవి, మెటర్నిటీ, గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేశారు. గురువారం ఉస్మానియాలో మంత్రి హరీశ్‌ రావు, ఎంఎన్‌జేలో కేటీఆర్‌, గాంధీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఈఎన్‌టీలో పద్మారావు గౌడ్‌ వీటిని ప్రారంభించనున్నారు. రెండో విడతలో మరికొన్ని ఆస్పత్రుల్లో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు.